ఉద్దానం ఉసురు తీస్తున్న ఇకొలి

ఉద్దానం ఉసురు తీస్తున్న ఇకొలి.


న్యూస్‌టుడే- ఏయూ ప్రాంగణం
(విశాఖపట్నం)

శ్రీకాకుళం జిల్లా ఉద్దానం మూత్రపిండాల వ్యాధికి మూల కారణాలు వెల్లడయ్యాయి. ప్రజలే కాదు.. *కొన్ని జంతువులు సైతం ఈ వ్యాధి పీడితులేనని తేలింది. భూమి లోపలి విషతుల్యమైన లోహాలు, ఇకొలి బ్యాక్టీరియా కారణంగానే నీరు, వాతావరణం కలుషితమై వ్యాధి వ్యాప్తికి కారణమవుతున్నాయని ఆంధ్ర విశ్వవిద్యాలయం ఆచార్యుల పరిశోధనలో తేలింది*. ఏయూ సైన్స్‌ కళాశాల ప్రధానాచార్యులు ఆచార్య డీఈ బాబు నేతృత్వంలోని ఏడుగురు పరిశోధక విద్యార్థుల బృందం 2015 డిసెంబరు నుంచి పరిశోధన ప్రారంభించింది. 300కు పైగా నమూనాలను సేకరించింది. ఉద్దానం ప్రాంత నీరు, ఆహార పదార్థాల ప్రయోగాల విశ్లేషణలో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకొచ్చాయి. బహిరంగ మూత్ర విసర్జన వల్ల ఇకొలి బ్యాక్టీరియా వాతావరణంలో వేగంగా విస్తరించి కొత్తవారికి వ్యాధి సోకుతోంది. చివరకు కొబ్బరి నీళ్లు సైతం హానికారక జాబితాలో చేరడం తీవ్రతను తెలియజేస్తోంది. వరి పంటకు మాత్రం ఎలాంటి ప్రమాదం లేకపోవటం కొంత ఉపశమనమే. బయట ప్రాంతాల నుంచి దిగుమతవుతున్న కూరగాయాల్లోనూ ఎలాంటి విషపూరిత పదార్థాలు బయటపడ లేదు.

*ఎలా నిర్ధరణకొచ్చారంటే...*

ఉద్దానంలోని నీరు, కొన్ని రకాల చేపలు, కూరగాయలు, కొబ్బరిబొండాలు, చిట్టెలుకలు, ఎలుకలు, కుందేళ్లు, నాటుకోళ్లపై ఏయూ బృందం పరిశోధించింది. అక్కడ *భూగర్భజలంలో భారలోహాలు* విషతుల్యమైనవిగా మారాయని వెల్లడయింది. అక్కడ వినియోగంలో ఉన్న నీరు, ఆహార పదార్థాలను విశాఖకు తీసుకొచ్చి నాటుకోళ్లు, కుందేళ్లు, ఎలుకలపైనా బృందం ప్రయోగించింది. దీన్ని బయో ఎక్యుమలేషన్‌ విధానం అంటారు. కొంతకాలానికి వీటిల్లోని మూత్రపిండాలు సైతం దెబ్బతిన్నట్టు గుర్తించారు. ఈ పరిశోధనాంశాలను ఇటీవల హార్వర్డ్‌ విశ్వవిద్యాలయ నిపుణుల దృష్టికి కూడా తీసుకెళ్లారు.

*హద్దులు విస్తరించుకుంటూ...:*

సుమారు 18 ఏళ్ల కిందట ఉద్దానంలో ఈ వ్యాధి ఉనికి వెలుగులోకి తెచ్చింది. గతంలో కొన్ని గ్రామాలకే పరిమితమైన ఈ వ్యాధి కవిటి, సోంపేట, కంచిలి, ఇచ్ఛాపురం, పలాస, వజ్రపుకొత్తూరు మండలాల పరిధిలోని వంద గ్రామాల్లోనూ కనిపిస్తోంది. ఇద్దవానిపాలెం, బల్లిపుట్టిగ, చిన్నబల్లిపుట్టిగ, వరక, రాజపురం, కొత్తపుట్టిగ, యర్రగోవిందపుట్టిగ, తిప్పని పుట్టిగ, అగ్రహారం, చినశ్రీరాంపురం, పెద శ్రీరాంపురం, బోరివంక, బలరామపురం, గొల్లగంటి, మెట్టూరు, కవిటి ఇలా పలు గ్రామాలలో సమస్య తీవ్రంగా ఉంది.

*🦋పరిశోధన విషయాలివి..*

* శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం, పలాస నియోజకవర్గాల మధ్య ఉద్దానం విస్తరించి ఉంది. కొన్ని గ్రామాలు సముద్రతీరంలో ఉన్నాయి. మహేంద్రగిరుల నుంచి ప్రవహించి సముద్రంలో కలుస్తున్న సెలయేళ్లు, వాటిల్లోని కలువ పూలు, చప్పనీటిలో అడుగున ఉండే మట్టలు, బొమ్మిడాయిలు వంటి చేపలు, భూగర్భజలం, నాటు కోళ్లు, కొబ్బరిబొండాలు, మునగ, పనస కాయలు ఇలా చాలావాటిల్లో విద్యార్థి బృందం పరిశోధించింది. మహేంద్రగిరుల్లో బాక్సైటú, ఇనుము సహా పలు ఖనిజాలు అధికంగా ఉండడం వల్లనే ఇక్కడి భూమిలో వాటి శాతం ఎక్కువ ఉండొచ్చని తేలింది.

* మనిషి మాదిరి మూత్రపిండాల వ్యవస్థ ఉన్న కుందేళ్లు, చిట్టెలుకలపైనా పరిశోధించారు.

* మాంగనీసు, ఐరన్‌, అల్యూమినియం, స్ట్రాన్షియం, బేరియం, క్రోమియం, కాపర్‌, జింక్‌, గాలియం తదితర 20 లోహాలను భూమి లోపల గుర్తించారు. అల్యూమినియం, స్ట్రాన్షియం తదితర నాలుగైదు ప్రమాదకర లోహాలు భూమిలోపల క్లోరైడ్‌తో కలిసి నీటిలో చేరుతున్నాయి.

* ఇనుము నీటిలో కరగదు. క్లోరైడ్‌లో కరిగి ఫెరిక్లోరైడ్‌గా మారుతుంది. నీటిలో ఉన్న సోడియంక్లోరైడ్‌తో కలిసి అల్యూమినియం క్లోరైడ్‌గా మారుతోంది. మామూలుగా అల్యూమినియం నీటిలో కరగదు. ఇది కోర్లైడ్‌తో కలిస్తేనే నీటిలో కరుగుతుంది. ఇలా భూమిలోపల నీటిలో కరిగి బోర్ల ద్వారా బయటకొస్తోంది. ఈ నీటిని తాగిన వారు లోహ కాలుష్యం బారిన పడుతున్నారు. ఇది వారి మూత్రపిండాలపై ప్రభావం చూపుతోంది. ఈ నీటి ద్వారా పెరిగిన మునగ, పనస, కొబ్బరి ఉత్పత్తులూ విషతుల్యమవుతున్నాయి.

* ఈ నీరు వూరిన ఏరుల్లో జీవించే బొమ్మిడాయిలు, మట్టలు, సవళ్లు, ఇంగిలాయిలు, మార్పుల వంటి చేపల్లోనూ ఈ లోహాలు చేరుతున్నాయి. వీటిని తిన్నవారి మూత్రపిండాలు దెబ్బతింటున్నాయి.

* పంటలకు అమ్మోనియం సల్ఫేటú, నైట్రేటú వంటి వాటిని ఎరువుగా ఉపయోగిస్తారు. ఇవి భూమి లోపల ఉన్న లోహాలతో సమ్మిళతమై ప్రభావం చూపుతున్నాయి. తద్వారా ఆహార ఉత్పత్తులు లోహ కాలుష్యాలవుతున్నాయి. ఉద్దానంలోని వరి పంటలో మాత్రం ఈ ప్రభావం కనిపించలేదు.

* నాటుకోళ్లలోని మూత్రపిండాలు కూడా దెబ్బతింటున్నాయి. వాటి కాలేయాన్ని ఆహారంగా తీసుకున్న వారిలో వ్యాధి తీవ్రత కనిపిస్తోంది.

*✔తక్షణం చేయాల్సినవి*

* వ్యాధి పీడితులు మాంసం, చేపలు తినడాన్ని మానేస్తే మంచిదని పరిశోధకులు సూచిస్తున్నారు. అక్కడి కొబ్బరినీళ్లు తాగడం, పనస, మునగ తక్కువ తీసుకుంటేనే మంచిదని తెలిపారు. వ్యక్తిగత మరుగుదొడ్ల వినియోగం నూరుశాతం అమలు చేయాలి.

*♦పుట్టి ముంచుతున్న బ్యాక్టీరియా*

ఉద్దానంలో అపరిశుభ్ర వాతావరణం వల్ల ఇకొలి బ్యాక్టీరియా వృద్ధి చెందుతోంది. ఇది వ్యాధి పీడితుల్లోకి ప్రవేశించి మూత్రపిండాల కణాలను తినేస్తోంది. దీనివల్ల లోపల రక్తస్రావమవుతోంది. మూత్రవిసర్జన నాళం కుచించుకుపోతోంది. మూత్రంలోని యూరిక్‌ యాసిడ్‌ వెనక్కి వెళ్లి రక్తంలో కలుస్తోంది. క్రమేణా రక్తంలో దీని శాతం పెరుగుతోంది. వ్యాధిగ్రస్తులు బహిరంగ మూత్ర విసర్జన చేసినపుడు వెలువడిన ఇకొలి బ్యాక్టీరియా ఇతరులకు సోకుతోంది. ఉద్దానం నుంచి వ్యాధి ఇతర ప్రాంతాలకు వేగంగా విస్తరించడానికి బహిరంగ మలమూత్ర విసర్జన కూడా ప్రధాన కారణమని తేలింది.

* ఉద్దానంలోని చిన్న చిన్న జంతువుల మూత్రపిండాలు, కాలేయాలకు లోహ కాలుష్య ప్రభావం వల్ల శరీరం లోపల రక్తస్రావమవుతోంది. ఇకొలి బ్యాక్టీరియా వృద్ధి చెంది మూత్రపిండాలు దెబ్బతింటున్నాయి.

* లోహ కాలుష్యం వల్ల మనుషులు, జంతువుల్లోనూ కాల్షియం సమస్య ఉత్పన్నమవుతోంది. కాళ్లు లాగడం, జిల రావడం వంటి లక్షణాలు, చలి వణుకుతో జ్వరం వస్తోంది.

*♦లోహ ప్రభావంపై జాగ్రత్త*

శరీరంలో లోహ ప్రభావం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. మూత్రపిండాల వ్యాధిని ప్రాథమిక దశలో గుర్తించి మెటల్‌ కీలేషన్‌ చేస్తే వ్యాధి చాలావరకు చికిత్సకు లొంగుతుంది. ఎంతవరకు మూత్రపిండం దెబ్బతిన్నదో గుర్తించాలి. మూత్రపిండం పునర్‌ వినియోగానికి రీజనరేషన్‌ ప్రక్రియ ద్వారా శరీరంలో పోయిన కణాలను తిరిగి ఉత్పత్తి చేయాలి. ఈ విషయంలో మరిన్ని ప్రయోగాలు చేయాల్సి ఉంది. ఉద్దానంలో రోగ పీడితుల నుంచి ఇతరులకూ వ్యాధి సోకే పరిస్థితి కనిపిస్తోంది. దీనిపై అప్రమత్తత అవసరం. ఏయూలోకానీ, ఉద్ధానంలోకానీ ప్రత్యేక పరిశోధనశాలను ఏర్పాటుచేయాలి.

Comments